AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది.
ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్ను పార్టీ అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే కొనసాగించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే జనసేన ఇద్దరి అభ్యర్థులను ప్రకటించడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇక త్వరలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయమై క్లారిటీ రానుంది.