Site icon HashtagU Telugu

Pawan Kalyan Tweet: వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి: పవన్ కళ్యాణ్

Pawan

Pawan

Pawan Kalyan Tweet: ఏపీ సీఎం జగన్ పర్యటనలో పలు చోట్లా చెట్లు నరికేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రిపై తనదైన స్టయిల్ లో విమర్శించారు. ‘‘కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు.  ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు   ఈ విషయం కూడా తెలుసుకోవాలి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

‘‘ఓయీ మానవుడా

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు

సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి

అందమును హత్య చేసెడి హంతకుండా

మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..

అని దూషించు పూలకన్నియల కోయలేక

వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని

నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..

ప్రభూ ’’

అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను టార్గెట్ చేసుకొని పలు సమస్యలను నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థ మొదలుకొని నేటి చెట్ల నరికివేత వరకు అనేక సమస్యలపై పవన్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక తాజాగా  ఏపీలోని కృష్ణాయపాలెంలో CM భూమిపూజ చేసిన చోట జనసేన కార్యకర్తలు మెరుపు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే జనసైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం కోర్టులో ఉండగానే ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రశ్నించారు. పేద ప్రజలను సీఎం మోసం చేస్తున్నారని మండిపడ్డారు.