Balakrishna Vs Paripoornananda : పరిపూర్ణానంద ఎంట్రీ.. బాలయ్య ఇలాఖాలో ట్రయాంగిల్ ఫైట్ ?

Balakrishna Vs Paripoornananda :  టీడీపీ అగ్రనేత నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానంపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 08:22 AM IST

Balakrishna Vs Paripoornananda :  టీడీపీ అగ్రనేత నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానంపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఈ టికెట్‌ను మునుపటిలా తానే తీసుకుంది.  ఒకవేళ ఈ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే.. తనకు టికెట్ వస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఆయన హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో హిందూపురంలో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది.  ఈ నామినేషన్ వేయడానికి ముందు స్వామి పరిపూర్ణానంద కీలక ప్రకటన చేశారు. తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తాను బీజేపీ రెబల్‌ అభ్యర్థిని కాదని, స్వతంత్ర అభ్యర్థిని అని స్పష్టం చేశారు. గత ఆరు నెలలుగా తాను హిందూపురంలోనే  పర్యటిస్తున్నానని, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకే బీజేపీ నుంచి టికెట్ ఆశించినట్లు చెప్పారు. కొందరు పెద్దల తమ స్వార్థంకోసం తనకు టికెట్‌ దక్కకుండా చేశారని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. హిందూపురం అభివృద్ధికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తానని ఆయన అనౌన్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

నో బుజ్జగింపులు

గత రెండు ఎన్నికల్లోనూ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ గెలిచారు. ఈసారి స్వామి పరిపూర్ణానంద ఎంట్రీతో ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. స్వామి పరిపూర్ణానంద బరిలోకి దిగినందున ఎన్డీయే కూటమి ఓట్లు చీలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ‘హిందూ’ అనే పేరున్న నియోజకవర్గం ఇదేనని.. అందుకే తాను హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పరిపూర్ణానంద స్వామి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఓ మెజారిటీ వర్గం ఓట్లను టార్గెట్‌గా చేసుకొని పరిపూర్ణానంద ప్రచారాన్ని సాగించే అవకాశం ఉంది. అదే జరిగితే కొన్ని ఓట్లయినా ఆయనకు పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్నేళ్ల నుంచి అభివృద్ధిలో హిందూపురం వెనుకబడి ఉందన్న పరిపూర్ణానంద.. హిందూపురం అభివృద్ధిపై బీజేపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇస్తే పోటీ నుంచి వైదొలుగుతానని అంటున్నారు. అయితే అటు బీజేపీ నేతల నుంచి కానీ.. ఇటు టీడీపీ వైపు నుంచి కానీ పరిపూర్ణానందను బుజ్జగించే ప్రయత్నాలు జరగకపోవడం గమనార్హం.

Also Read : Kodad Road Accident : లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం

వైఎస్సార్ సీపీ మహిళా అస్త్రం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం స్థానంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణకు 91,704 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి షేక్ మొహమ్మద్ ఇక్బాల్‌ 74,676 ఓట్లు  సాధించారు. దీంతో 17,028 ఓట్ల మెజారిటీతో బాలయ్య బాబు విజయం సాధించారు. టీడీపీ కంచుకోట హిందూపురంను ఈసారి ఎలాగైనా బద్ధలుకొట్టాలనే పట్టుదలతో సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్ధితో వైఎస్సార్ సీపీ ప్రయోగం చేసినా ఫలితం రాలేదు. దీంతో ఈసారి మహిళా అస్త్రాన్ని జగన్ ప్రయోగించారు. బీసీ వర్గానికి చెందిన దీపికను అభ్యర్ధిగా అనౌన్స్ చేశారు. మహిళా ఓటు బ్యాంక్‌తో పాటు బీసీ సామాజికవర్గానికి నేత కావడంతో తమకు కలిసొస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటకకు సమీపంలో ఉండే హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఇప్పటివరకు హిందూపురంలో టీడీపీ అభ్యర్ధులు 10 సార్లు విజయం సాధించారు.ఇక్కడ సైకిల్ జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని మహామహులు ట్రై చేసినా వల్ల కాలేదు.

Also Read :Usain Bolt: క్రికెట్ ప్ర‌పంచంలోకి ఉసేన్ బోల్ట్‌.. ఆడ‌టానికి కాదండోయ్‌..!