సర్వేలతో రాజకీయ పార్టీలు గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయింది. వాటి ద్వారా ప్రజల మూడ్ ను మార్చడానికి చేసే కుయుక్తులు ఎన్నో. అందుకే, కోట్లాది రూపాయలను సర్వే సంస్థలకు ఇస్తూ అనుకూలంగా సర్వే ఫలితాలను క్రియేట్ చేసే సంస్కృతి ఇటీవల కాలంలో పెరిగింది. 2014 ఎన్నికల నుంచి క్రమంగా ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వాటి ప్రభావం మరింత పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వే అంటూ పలు రకాలుగా కొన్ని సంస్థలు సర్వేలను చేయడం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ సంస్థ పేరుతో చేసే సర్వే 2009 నాటికి ప్రాచుర్యం పొందింది. ఆ సర్వే ఆధారంగా చాలా మంది జూదరులు బెట్టింగ్ లకు దిగే వాళ్లు. దివంగత వైఎస్ హయాంలో లగటపాటి సర్వేలు ప్రాచుర్యం పొందాయి. ఆ తరువాత 2014 ఎన్నికల నాటికి కొన్ని జాతీయ సర్వే సంస్థలు ప్రముఖంగా పుట్టుకొచ్చాయి. వాటికున్న బ్రాండ్ నేమ్ ఆధారంగా రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయాలు చెల్లించడం ద్వారా అనుకూలంగా సర్వే ఫలితాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడం జరుగుతోంది.
ప్రస్తుతం సర్వే సంస్థల విచ్చలవిడితనం పెరిగింది. వాటికి ఎలాంటి నిబంధనలు, నియమాలు ఉండవు. వ్యక్తిగతంగా కూడా సర్వేలను విడుదల చేసే వాళ్లు ఉన్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకుని సర్వే గేమ్స్ ను ఆడుతున్నాయి. అలాంటి గేమ్ తాజాగా తెరమీదకు వచ్చింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్వేల రచ్చ మొదలయింది. సీఎన్ఓఎస్, ఆరా ఇచ్చిన సర్వే రిపోర్టుల్లోని నిజాయితీని బయట పెట్టడానికి సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం అయింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది. ఆయన 20వ స్థానంలోకి పడిపోయారని సీఎన్ఓఎస్( CNOS) తేల్చింది. అంతేకాదు, 11వ స్థానానికి తెలంగాణ చీఫ్ కేసీఆర్ పడిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ 56శాతం ఉందని ఆ సర్వే తేల్చింది. తెలంగాణలో హాట్రిక్ విజయాన్ని కేసీఆర్ అందుకుంటారని ఆరా(AARAA) సర్వే చెబుతోంది. రెండో స్థానంలో బీజేపీ మూడో ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుందని చెప్పింది.
రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య మాటల యుద్ధం మధ్య, AARAA పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన సర్వేలో TRS సురక్షితంగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం గులాబీ పార్టీకి ఓట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే ఎన్నికలు ప్రకటిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని చెబుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల శాతం 46.87 శాతం నుంచి 41.7 శాతానికి పడింది. ఇప్పుడు 38.88 శాతానికి ఉందని ఆరా చెబుతోంది.
Party | Assembly Poll 2018 (vote share in percentage) | Lok Sabha Poll 2019 (vote share in percentage) | Current Survey (vote share in percentage) |
TRS | 46.87 | 41.71 | 38.38 |
Congress | 29.43 | 29.78 | 23.31 |
BJP | 5.98 | 19.65 | 30.48 |
AARAA polls survey
బీజేపీ, కాంగ్రెస్ల పనితీరు
మరోవైపు, రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల పనితీరుతో పోలిస్తే బీజేపీ చాలా మెరుగుపడినప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రన్నరప్గా నిలిచింది. అయితే, రాబోయే ఎన్నికలలో, దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ తన ఓట్ షేర్లో తగ్గుదలని చూస్తుంది.
నవంబర్ 2021 నుండి మూడు దశల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సర్వేలో టీఆర్ఎస్కు 87 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని, కాంగ్రెస్ మరియు బీజేపీలో బలమైన అభ్యర్థుల సంఖ్య వరుసగా 53 మరియు 29 అని పేర్కొంది. బహుజన్ సమాజ్ పార్టీకి (BSP) శుభవార్త కూడా అందించింది. రాష్ట్రంలో ఆ పార్టీ ఓట్ల శాతం ఐదు శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. వైఎస్ఆర్టీపీకి చెందిన వైఎస్ షర్మిలకు కొన్ని వర్గాల ప్రజల నుంచి ప్రత్యేకించి నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి మద్దతు లభిస్తుంది.
బీజేపీ, ఏఐఎంఐఎంలకు చేదువార్త
తక్షణం ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, సర్వేలో గులాబీ పార్టీకి కూడా చేదువార్త వచ్చింది. 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులు ఎక్కువ మంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. మలక్పేట, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏఐఎంఐఎం అభ్యర్థులకు బీజేపీ గట్టిపోటీ ఇస్తుందని సర్వే అంచనా వేసింది ఆరా సర్వే.
ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోయిందని చెబుతోన్న సీఎన్ఓఎస్ ను టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ నిర్వహిస్తున్నారని వైసీపీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆయన ఐపీతో నడిపిస్తోన్న వెబ్ సైట్లు, సర్వే సంస్థ సీఎన్ఓఎస్ బండారం బయటపెట్టింది. సోషల్ మీడియా వేదికగా రాబిన్ శర్మ వ్యవహారాన్ని బయటకు లాగింది. ఇక ఆరా సంస్థను నిర్వహిస్తోన్న మస్తాన్ ఆర్ఎస్ఎస్ సానుభూతిపరునిగా సోషల్ మీడియా వేదికగా క్లూలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మొత్తం మీద ఎన్నికల సమీపిస్తోన్న కొద్దీ సర్వేల రచ్చ తారాస్థాయికి చేరనుందని అర్థం అవుతోంది. ఇలాంటి సర్వేల రచ్చలతో ప్రజల నాడిని సానుకూలంగా మలుచుకోవాలన్న ప్రయత్నాలు పూర్వం ఎన్నో వైఫల్యం చెందారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2019 ఎన్నికలు కనిపిస్తాయి. ప్రముఖ టీవీ ఛానెళ్లు, లగడపాటి ప్లాష్ టీమ్ లు ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సర్వేలు బూమ్ రాంగ్ అయిన విషయం విదితమే.