Ineligible Candidates : దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీకి అనర్హులైన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా రూపొందించిన ఆ లిస్టులను ఆయా రాష్ట్రాల రిటర్నింగ్ అధికారులకు ఈసీ పంపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో మొత్తంగా 51 మంది త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ ప్రకారం ఈ లిస్టులోని 51 మంది వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని తెలుపుతూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చి 15 నాటికి రూపొందించిన అనర్హుల జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఈసీ స్పష్టం చేసింది.ఈ లిస్టును ఏపీలోని రిటర్నింగ్ అధికారులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఈసీ ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈసీ అనర్హులుగా ప్రకటించిన అభ్యర్థుల(Ineligible Candidates) లిస్టులో.. ప్రముఖ నాయకుల పేర్లను కలిగినవారు ఉండటం గమనార్హం.ఉదాహరణకు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అనర్హుల జాబితాలో ఈసీ చేర్చింది. గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆయన పేరే కలిగిన వ్యక్తిని ఈసీ అనర్హుల లిస్టులో చేర్చింది. ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఓటరు నమోదు సమస్యలతో పాటు ప్రచారంలో భాగంగా నాయకులు డబ్బు, మద్యం, ఇతర కానుకల వంటివి పంచినా నేరుగా ఫిర్యాదు చేసేలా టోల్ఫ్రీ నెంబరును కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే 1950 !! ఇందులో భాగంగా జిల్లాల వారీగా కలెక్టరేట్లలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి అయినా 1950 నెంబరుకు డయల్ చేస్తే ఆ జిల్లా కేంద్రంలోని కంట్రోల్రూంకు సమాచారం వెళ్తుంది. ఆయా జిల్లాలకు వచ్చిన కాల్ ఎవరూ లిఫ్ట్ చేయకపోతే ప్రధాన ఎన్నికల కమిషనరు కార్యాలయానికి కాల్ కనెక్ట్ అవుతుంది. ఇలా మనం చేసే ఫోను తప్పక కలిసేలా చర్యలు తీసుకోవడం గమనార్హం.