టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ (Kavali Greeshma) ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ (Chairperson of AP Women Cooperative Finance Corporation) పదవికి రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తిన గ్రీష్మకు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆమెకు ఛైర్పర్సన్ పదవి కేటాయించారు. అయితే ఇటీవల ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గ్రీష్మకు అవకాశం ఇవ్వడంతో, ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Shark Tank Show : ‘షార్క్’గా మారిన తెలుగు వ్యాపారవేత్త.. శ్రీకాంత్ బొల్లా గ్రేట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో కావలి గ్రీష్మతో పాటు బీద రవిచంద్ర, బీటీ నాయుడు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. బీజేపీ-జనసేన కూటమి తరఫున నాగబాబు, సోము వీర్రాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కావలి గ్రీష్మ తన ఛైర్పర్సన్ పదవికి రాజీనామా లేఖ సమర్పించగా ప్రభుత్వం దానిని ఆమోదించింది.
ఇక త్వరలోనే ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశముంది. నారా చంద్రబాబు నాయుడు నూతనంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రీష్మ ఎమ్మెల్సీగా కొత్త బాధ్యతలు స్వీకరించగా ఆమె స్థానంలో కొత్త నేతకు ఛైర్పర్సన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. కొత్త నియామకం పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.