ఢిల్లీ మద్యం స్కామ్ వెనుక వైసీపీ పరోక్ష మూలాల బయటకొస్తున్నాయి. ఆ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి , ఆ కంపెనీకి చెందిన బెనోయ్ బాబు మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ ప్రాథమికంగా నిర్థారించింది. ఆ మేరకు వాళ్లిద్దర్నీ అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయాన అన్న శరత్ చంద్రారెడ్డి కావడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు పలుమార్లు దాడులు నిర్వహించింది. మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహంద్రును సెప్టెంబర్ లో అరెస్టు చేసింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చెందిన పీఏ ప్రాంగణంపై దాడి చేసి, ఆ తర్వాత ఢిల్లీలో ఆయనను ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో సిసోడియాను ఇతర నిందితులుగా పేర్కొన్న సిబిఐ నమోదు చేసింది. డిప్యూటీ సీఎం, కొందరు ఢిల్లీ ప్రభుత్వ బ్యూరోక్రాట్లపై సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులోని అక్రమాలపై ఢిల్లీ ఎల్జీ సీబీఐ విచారణకు సిఫారసు చేసిన విషయం విదితమే. 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా ఎల్జీ సస్పెండ్ చేసింది.
Also Read: Kadapa University: జగన్ వింత పోకడ, `యోగి వేమన`కు అవమానం!
ఇప్పుడు ఆ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాలు ప్రకటించాయి. శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ గుర్తించింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.
అమెరికా నుంచి అరబిందో ఔషధాలను రికాల్ చేశారు. తయారీ లోపాల కారణంగా అమెరికా నుంచి వివిధ ఔషధ ఉత్పత్తులను అరబిందో ఫార్మా రికాల్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యూఎస్ సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్ఏ ఇంక్..9,504 క్వినాప్రిల్ బాటిల్స్ను, హైడ్రోక్లోరోథిజైడ్ ట్యాబ్లెట్లను రికాల్ చేసినట్లు యూఎస్ఎఫ్డీఏ తాజా ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్లో తెలిపింది. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే ఈ ఔషధాలను ఇండియాలో తయారు చేసి, అమెరికాలో అరబిందో ఫార్మా యూఎస్ మార్కెట్ చేసింది. అలాగే అరబిందో ఫార్మా యూనిట్ అరోమెడిక్స్ ఫార్మా ఎల్ఎల్సీ అమెరికా మార్కెట్ నుంచి 11,520 ఫొండాపారినుక్స్ సోడియం ఇంజెక్షన్ యూనిట్లను రికాల్ చేసినట్లు యూఎస్ఎఫ్డీఏ మరో ప్రకటనలో పేర్కొంది.
Also Read: Ippatam Issue: కొట్టినా జగనన్నే, కూల్చినా జగనన్నే.!
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కీలక లీడర్ల కుటుంబాలకు దడపుట్టిస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సొంత సోదరుడు శరత్ చంద్రారెడ్డి కావడంతో రాజకీయ కోణం నుంచి ఈ కేసును ప్రత్యర్థులు చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ పై ఇప్పుడేమంటారు? అంటూ టీడీపీ నిలదీస్తోంది. మద్య నిషేధం అంటూ మాఫియాగా ఏర్పడి కొత్త బ్రాండ్లను విడుదల చేయడం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని జగన్ అండ్ కో పొందారని తెలుగుదేశం చేస్తోన్న ప్రధాన ఆరోపణ. దానికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ ను ఈడీ అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.