తిరుమల : నేటి ఉదయం గుండెపోటుతో విశాఖలో డాలర్ శేషాద్రి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి తరలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సాయంత్రానికి తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. అంత్యక్రియలు ఎప్పుడు అన్నదానిపై శేషాద్రి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పాలయ్యారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. కాగా.. వేకువజామున గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. కాగా డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.