తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కానిస్టేబుల్ ప్రకాష్ను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమని, అతనిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబాన్ని పండగపూట పస్తులుంచిన దిక్కుమాలిన ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఆ కుటుంబం ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదని హెచ్చరించారు. ప్రకాష్ మాదిరి మిగతా పోలీసులు కూడా నోరెత్తగలిగితేనే వారికి న్యాయం జరగుతుందన్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి అణిచివేతకు రోజూ చింతించక తప్పదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.పోలీసుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు.
కుటుంబ సభ్యులను వదిలి పండుగ నాడు సైతం ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడే పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామన్న జగన్ మోహన్ రెడ్డి మాట ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సాక్షిగా ఏటా 6 వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి, హోంమంత్రి హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కోవిడ్ లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారని, ఒక్కరికైనా సాయం చేశారా అని ప్రశ్నించారు. అర్హత లేని వారికి కేబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో పెట్టి వేధిస్తున్నారని సత్య ప్రసాద్ మండిపడ్డారు.