ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన ధర్మాన సోదరులు (Dharmana Brothers) తాజా ఎన్నికల తర్వాత సైలెంట్ కావడం పార్టీ శ్రేణుల్లో (YCP) ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఈ నేతలు, వైసీపీ ఓటమి తర్వాత ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా మారింది. ఒకవైపు పార్టీకి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనాల్సిన సమయం ఇది, కానీ ఈ సమయంలోనే వీరి మౌనం కార్యకర్తల్లో నిరుత్సాహానికి కారణమవుతోంది.
ముఖ్యంగా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండిపోవడం, తమ్మినేని సీతారాం (Tammineni Seetharam) పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాక, తన నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలపై అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపించడం పార్టీ లోపల ఒత్తిడికి దారి తీస్తోంది. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సైతం పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయమే లేకపోవడం ఆయన నిర్లక్ష్యాన్ని చాటుతోంది.
ఈ పరిస్థితుల్లో క్యాడర్ తడబాటుకు గురవుతోంది. సీనియర్ నేతలు రాజకీయంగా రిటైర్ అవ్వాలనుకుంటే అధికారికంగా ప్రకటించాలని, లేదంటే పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటిస్తే కొత్త నాయకత్వానికి మార్గం సుగమమవుతుందని అంటున్నారు. కానీ మౌనం కొనసాగితే పార్టీ పునర్నిర్మాణం అసాధ్యమవుతుందని అంటున్నారు. మొత్తంగా ఈ ముగ్గురు నేతల తీరుపై వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతోంది.