Site icon HashtagU Telugu

Krishna River: కార్తీక మాసం పుణ్య‌స్నానాల‌పై ఆంక్ష‌లు…కార‌ణం ఇదే…?

ఏపీ వ్యాప్తంగా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్రంతో పాటు ఎగువ కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు,వంక‌లు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటిపారుదల, అగ్నిమాపక, పోలీసు, మత్స్యశాఖల అధికారులను శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నివాస్‌ ఆదేశించారు.

జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 11.6మి.మీ వర్షపాతం నమోదైంది. అవనిగడ్డలో 74.2, నాగాయలంకలో 46.8, మచిలీపట్నంలో 40.6, కోడూరులో 39.2, పామర్రులో 32.4, మోపిదేవిలో 27మి.మీ వర్షపాతం నమోదైంది.

Also Read: వైజాగ్‌కు మరో గండం

మంగినపూడి, హంసలాదేవి, కోడూరు తదితర బీచ్‌లలోకి భక్తులకు ప్రవేశం లేదని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు కృష్ణా నది, కాలువల్లోకి వెళ్లవద్దని కోరారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మంగినపూడి, పెద్దపట్నం తదితర బీచ్‌లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

Also Read: విధిరాత‌.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్ర‌బాబు శ‌ప‌థం

రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 80 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) 10వ బెటాలియన్ కమాండర్ జాహిద్ ఖాన్ తెలిపారు. తిరుపతి మరియు నెల్లూరులో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయ‌ని తెలిపారు.కృష్ణానది తీరాన ఉన్న అన్ని బీచ్‌లు, పుష్కరఘాట్‌లను మూసివేశామని, గట్ల వెంబడి పెట్రోలింగ్‌ ముమ్మరం చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ ఎండీ మహబూబ్‌బాషా తెలిపారు.