Site icon HashtagU Telugu

Cyclone Michaung : తీరం దాటిన తుఫాను.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Cyclone Michaung

Cyclone Michaung

Cyclone Michaung : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని  నెల్లూరులోని ముత్తుకూరు దగ్గర సోమవారం రాత్రి 11.30 గంటలకు తీరం దాటింది. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 110 కిలోమీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ఈ తుఫాను కావలి దగ్గరలో ఉంది. తుఫాను ఇవాళ ఒంగోలు, చీరాల, వినుకొండ, పిడుగురాళ్ల, డిచ్‌పల్లి వైపుగా వెళ్లి.. సాయంత్రానికి మిర్యాలగూడ దగ్గరకు వెళ్లి, మంగళవారం అర్థరాత్రి తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది బుధవారం తెల్లవారుజాము సమయానికి సూర్యాపేటను చేరుతుంది. ఈక్రమంలో బుధవారం ఉదయం 11 గంటలకు వరంగల్ వైపుగా తుఫాను వెళ్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ఆ సమయానికి  గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇవాళ (డిసెంబర్ 5) ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన ఉంది. తెలంగాణలోని దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో వానలు పడతాయి. వాయవ్య తెలంగాణ వర్షాలు పడవు. ఏపీలోని రాయలసీమలో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ రాయలసీమలో వర్షాలు అంతగా పడవు. ఇవాళ నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రొద్దుటూర్, నంద్యాల, మార్కాపురం, చీరాల, గూడూరు, మచిలీపట్నం, దర్శి, రేపల్లెకు అతి భారీ వర్ష సూచన ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తుఫాను ఒంగోలుకు చేరుతుంది. ఈ ఎఫెక్టుతో చీరాల, ఒంగోలు, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, ఖమ్మం, మార్కాపురం, నర్సారావు పేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం నుంచి తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇవాళ రాత్రి 6 గంటల తర్వాత తుఫాను గాలుల తీవ్రత తగ్గుతుంది. గాలుల వేగం గంటకు 95 కిలోమీటర్లుగా(Cyclone Michaung) ఉంటుంది.