Countdown for Jagan : సర్వేలు చెప్పడం కాదు, చంద్రబాబు పతనాన్ని కోరుతూ ఏడుకొండల వెంకటేశ్వరస్వామి వద్దకు మెట్లు ఎక్కి వెళ్లిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. అన్యాయంగా చంద్రబాబును జైలులో పెట్టించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ రివర్స్ అటాక్ ఇచ్చారు. ఈయనే 2018 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని దళిత నేతగా ఆ వర్గానికి పిలుపు ఇచ్చారు. అయితే, సీఎం అయిన వెంటనే మైకంలోకి వెళ్లారని జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని ఇప్పుడు తప్పుబడుతున్నారు. తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రశ్నించే వాళ్లకు తిట్టడం, కొట్టించడం, భయపెట్టడమే ప్రజాస్వామ్యమా? అంటూ నిలదీయడం టీడీపీ వర్గాలకు నూతనోత్సాహాన్ని ఇస్తోంది.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు( Countdown for Jagan) సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన దళిత నేత. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. అందుకే, అప్పట్లో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. అయితే, చంద్రబాబు వాడుకుని వదిలేసే రకమని విభేదించారు. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు మీద కోప్పడ్డారు. అంతేకాదు, చంద్రబాబు నాశనం కోరుతూ తిరుమల మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్లి మొక్కారు. ఇప్పుడు చంద్రబాబును జైలు పెట్టడాన్ని అభ్యంతర పెడుతున్నారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన త్యాగాలను గుర్తు చేస్తున్నారు. దేశంలోనే బీజేపీని రాజకీయంగా బతికించిన లీడర్ చంద్రబాబు అంటూ కొనియాడడం విశేషం.
`సుమారు 74 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దమనిషి, ఈ దేశానికే నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నావా? నువ్వొక దుర్మార్గుడి..` అంటూ మంత్రి మోత్కుపల్లి గళం విప్పడం(Countdown for Jagan) టీడీపీ వర్గాల్లో సంతోషం కలిగిస్తోంది. ఇటీవల జాతీయ మీడియా చేసిన సర్వేల్లోనూ చంద్రబాబు అరెస్ట్ , జైలుకు పంపడాన్ని వైసీపీలోని 34శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది. ఇప్పుడు మోత్కుపల్లి లాంటి వాళ్లకు కూడా చంద్రబాబు వైపు మొగ్గుచూపుతున్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డిని ఎవరూ రాజకీయంగా కాపాడలేరని స్పష్టమవుతోందని టీడీపీ భావన.
Also Read : Jagan in Trouble : చంద్రబాబుకు సానుభూతి వెల్లువ, సీ ఓటర్ సర్వే తేల్చివేత
`2021లో కేసు బుక్ అయింది. కేసులో ఉన్న వారంతా బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబును ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటి? చంద్రబాబు వంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏపీలో టీడీపీ హయాంలో రూ. 7 – 8 లక్షల కోట్ల బడ్జెట్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రజలకు వెళ్లింది. అలాంటి పెద్ద మనిషి ముష్టి రూ. 371 కోట్లకు దిగజారుతాడా? మాట్లాడేందుకు నీకు సిగ్గు, బుద్ధి వున్నాయా? మూడు సార్లు ముఖ్యమంత్రి, ఎన్నడూ ఏ ఆరోపణ కూడా రుజువు కాలేనటువంటి పెద్దమనిషి చంద్రబాబు. ఆయన ఏనాడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. చంద్రబాబు క్రిమినల్ కాదు. `అంటూ జగన్మోహన్ రెడ్డికి బుద్ది చెప్పారు మాజీ మంత్రి మోత్కుపల్లి.
Also Read : Jagan Bail anniversary : న్యాయదేవతకు గంతలు! జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు పదేళ్లు..!!
`వ్యక్తులే లేకుండా చేయాలనుకుంటున్నావా జగన్? ఈ నాలుగేళ్లు ఏం పీకావని నేను అడుగుతున్నా. ఎన్నికలు రేపు అనగా.. ఈ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? చంద్రబాబు వయసుకు విలువిచ్చి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పు” అంటూ జగన్ పై మోత్కుపల్లి ఫైర్ కావడం చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లిన ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ను కోరుకుంటున్నారు. స్వతహాగా ఎన్టీఆర్ వీరాభిమాని అయిన మోత్కుపల్లి ఎప్పుడు టీడీపీ బాగు కోసం పనిచేస్తుంటారు. అందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి బడుగు, బలహీనవర్గాల కోసం టీడీపీ మనుగడ సాగించాలని దైవంలాంటి ఎన్టీఆర్ ను ప్రార్థించానని చెప్పడం పార్టీకి ఖచ్చితంగా ఇదో శుభపరిణామంగా భావించాల్సిందే.