కార్తీక బ్రహ్మోత్సవాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో నిర్వాహకులు పలు జాగ్రత్తల మధ్య పూజలు, ఏకాంత సేవలు నిర్వహించాల్సి వస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్ద వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జరిగింది.
ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహక భేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.