ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తొలి రోజున గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. కరోనా కారణంగా గత ఏడాది కూడా ఆయన ఇదే పద్ధతిలో ప్రసంగం చేశారు. బడ్జెట్ ఎంత ఉంటుంది? తమకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందని అందరికన్నా ఎక్కుగా కాంట్రాక్టర్లలో ఆసక్తి నెలకొంది.
వారు చేసిన పనుల బిల్లులు ఎంతో కాలంగా పెండింగ్లో ఉండడమే ఇందుకు కారణం. ఈ బడ్జెట్లోనయినా తగిన ఫండ్స్ ఇచ్చి, క్లియర్ చేస్తారన్న ఆశ వారిలో కనిపిస్తోంది.బడ్జెట్లో కొత్త పథకాల కన్నా, పాత వాటిని కొనసాగించడానికే ప్రాధాన్యం ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఆ కారణంగానే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు నిధులు వస్తాయన్న భావన నెలకొంది.సాధారణంగా కొత్త బడ్జెట్ రావడానికి ముందే పాత బిల్లులు క్లియర్ చేస్తుంటారు. కానీ గత మూడేళ్లుగా రూ.1.50 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
వీటన్నిటికీ ఎప్పడు ఫండ్స్ ఇస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.ఈ సారి బడ్జెట్ దాదాపు రూ.2 లక్షల కోట్ల మేరకు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. జీతాలు, పథకాలు, ఇతర ఖర్చులకు కేటాయింపులు పోనూ, బిల్లుల క్లియరెన్స్కు ఎంత ఇస్తారన్నదానిపై కాంట్రాక్టు వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఆయా శాఖలకు ఇచ్చే నిధుల్లో పాత బిల్లుల కోసం ఎన్ని కోట్ల మేర కేటాయిస్తారన్నదానిపైనే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కొత్త పథకాలేవీ ఉండకపోతే పాతవి చాలా వరకు క్లియర్ అవుతాయన్న హోప్ చాలా మందిలో ఉంది.