Site icon HashtagU Telugu

APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !

Andhra Pradesh Logo

Andhra Pradesh Logo

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు.. 50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి సేవలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర విభాగాలలోని కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేసిన వయోపరిమితినే తమకు కూడా అమలు చేయాలని వీరంతా కోరుతున్నారు. 62 సంవత్సరాలు వచ్చే వరకు తమ సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్  టెండర్ పత్రాల మార్గదర్శకాలలో కాంట్రాక్టు సంస్థలు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమించుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయోపరిమితిని 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గించడం పూర్తిగా అన్యాయమని.. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వేయి మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలను ఈ నిర్ణయం ప్రమాదంలో పడేసిందని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, వర్కర్స్ యూనియన్ సభ్యులు విమర్శిస్తున్నారు.

 


మరోవైపు ఇటీవలి కాలంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 50 ఏళ్లు దాటిన పారిశుద్ధ్య కార్మికులను.. కాంట్రాక్టర్లు టెండర్ మార్గదర్శకాల ఆధారంగా తొలగిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. అయితే APMSIDC మార్గదర్శకాలలో 50 ఏళ్లు దాటిన వారిని కొత్త నియామకాల్లో నియమించకూడదని మాత్రమే పేర్కొందని.. పాత వారిని తొలగించాలని చెప్పలేదంటున్నారు. మరోవైపు ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 50 ఏళ్లు పైబడిన వేయిమందికి పైగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని అంచనా.

 

వీరికి ప్రతి నెలా రూ.18600 వేతనం అందిస్తున్నారు. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మున్సిపల్ శాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉందని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, వర్కర్స్ యూనియన్ సభ్యులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం 50 ఏళ్లకు పరిమితం చేయడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. వారి మాదిరిగానే తాము కూడా పనిచేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఏపీఎంఎస్ఐడీసీ వాదన మరోలా ఉంది. 50 ఏళ్లు దాటిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని.. వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్తోంది.

Exit mobile version