Condom Politics: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పేర్లు, గుర్తులతో కండోమ్ ప్యాకెట్ల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాజకీయాల్లో కొత్త విధానానికి తెరలేపి ఇరు పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి పేర్లు మరియు చిహ్నాలతో కూడిన కండోమ్ ప్యాకెట్లను పార్టీ కార్యకర్తలు ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు వీడియోలు దర్శనమిస్తున్నాయి. తమ పార్టీ ప్రచారం కోసం ప్రజలకు కండోమ్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ తరహా ప్రచారంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకరు కండోమ్, మరొకరు వయాగ్రా ఇస్తే మరీ బాగుంటుందంటూ విమర్శిస్తున్నారు.
వైసీపీ కండోమ్ ప్యాకెట్ కవర్ పై సిద్ధం అని ఉండగా, టీడీపీ కవర్ పై టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసి ఉంది.అయితే ఈ తరహా ప్రచారాలపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఏప్రిల్-మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన కూటమి ఒకవైపు, వైసీపీ పార్టీ మరోవైపు బరిలోకి దిగుతుంది.