ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయనగరంలో పర్యటించనున్నారు. రేపు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలను కూడా ఇక్కడ నుంచే వర్చువల్గా ప్రారంభించనున్నారు. విజయనగరంతో పాటు రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతన వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 8,480 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుంది. ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారభించనుండగా.. మిగిలిన ఏడు కాలేజీల్లో తరగతులు ఆ తరువాత వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి.అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ఐదేళ్ల కాలంలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెంచింది. దీంతో మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న 2185 సీట్లకు 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఉన్నాయి. అదేవిధంగా పీజీ సీట్లను కూడా ప్రభుత్వం 966 నుంచి 1767కు పెంచింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.