ఏపీ(AP) ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను వారు సీఎంకు అందించారు.
సీఎం జగన్ తాజా నిర్ణయంతో ఏపీలోని సుమారు వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు జగన్ అధికారులను ఆదేశించారు. గ్రూప్-1కు సంబంధించి 100కిపైగా, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా ఖాళీలు ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం వెయ్యి పోస్టులను భర్తీ చేయనున్నామని అధికారులు చెప్పారు.
అయితే, ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సీఎం సూచించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని, త్వరలో నోటిఫికేసన్ జారీ చేస్తామని అధికారులు సీఎం జగన్కు వెల్లడించారు.