పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఏపీ అసెంబ్లీలో చర్చకు పెట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అసైన్డ్ భూములను కొందరు టీడీపీ నాయకులు సొంతం చేసుకున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. గతంలో మాదిరిగా మళ్లీ అదే రికార్డ్ ను వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
అమరావతి రాజధాని ప్రకటనకు ముందే అశ్వనీదత్, పయ్యావుల కేశవ్, హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేశారని మరోసారి ఆరోపణలకు దిగారు. పేదలకు ఇళ్ల స్థలాలను అమరావతిలో ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధిని జగన్ వివరిస్తూ వికేంద్రీరణ కారణంగా వచ్చిన ఫలితాలను వివరించారు. గ్రామ సచివాలయాల నుంచి వివిధ రంగాల్లో చేసిన పరిపాలన సంస్కరణల గురించి జగన్ పేర్కొన్నారు.
శ్రీబాగ్, శివరామక్రిష్ణ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలపై అధ్యయనం చేసి బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మూడు రాజధానులు, అధికార వికేంద్రకరణ బిల్లును తీసుకొచ్చామని అసెంబ్లీ వేదికగా జగన్ అన్నారు. అమరావతికి వ్యతిరేకం కాదని పదేపదే చెప్పిన జగన్ శాసన రాజధాని ఇక్కడే ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ రాజధాని కర్నూలు, నిర్వహణ రాజధాని విశాఖపట్నంకు వెళ్లి తీరుతుందని జగన్ వెల్లడించారు.
అభివద్ధి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి అందేలా వికేంద్రకరణ ఉందన్న విషయాన్ని జగన్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు కొందరు మహిళలు, రైతుల పేరుతో టీడీపీ ఉద్యమాన్ని చేయిస్తుందని అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తుంటే చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
అమరావతి రాజధాని కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చును జగన్మోహన్ రెడ్డి విడమరచి చెప్పారు. నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఎందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదని నిలదీశారు. అసెంబ్లీలో జరిగిన చర్చను చూసైన చంద్రబాబు మూడు రాజధానులకు సహకరించాలని జగన్ కోరారు. మొత్తం మీద మూడు రాజధానుల అంశంపై చర్చ వరకు అసెంబ్లీ పరిమితం అయింది. రాబోవు రోజుల్లో సమగ్ర బిల్లు ఉంటుందన్న విషయాన్ని సూచాయగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఐదు రోజుల పాటు జరగనున్న సమావేశాలు
శాసనసభ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. మూడు రాజధానుల రెఫరెండమ్గా అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోరింది. 3 ముక్కల రాజధానిపై జగన్కు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరింది. రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ కోరింది. నిరుద్యోగంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేశారు