స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఈడబ్ల్యూఎఫ్) సదస్సుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సదస్సు సందర్భంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇరువురు అనేక అంశాలపై చర్చించారు.
కాగా, డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం జగన్ సరికొత్త గెటప్ లో దర్శనమిచ్చారు. సూటుబూటు ధరించిన ఆయన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డి, అధికారులు వెంట రాగా, డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు తరలి వెళ్లారు.
పారిశ్రామిక పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన సీఎం జగన్ తొలిరోజు బిజీగా గడిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ వరుసగా అనేకమంది వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు.
బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ బక్నర్ తో భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం జగన్ ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.