CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపిలో భారీ వర్షాల పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు, బాధితులకు వెంటనే సాయం అందించాలన్నారు. నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. పంట నష్టం అంచనా వేసి అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పారు.
దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదలపై ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్షపాతం నమోదు తదితర అంశాలు సీఎంకు సీఎస్ వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని సూచించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం కావాలన్న సీఎం.. తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు.
విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం.. సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలని ఆదేశించారు. అక్షయ పాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని, ఖర్చు గురించి ఆలోచన చెయ్యవద్దని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి పంపించారు. నిముషాలు లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వెంటనే అన్ని దుకాణాల నుంచి బిస్కట్లు, పాలు తెప్పించాలని సూచించారు. విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్ సీఎం.. తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఈరోజు బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.