Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “జై తెలుగుదేశం” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగగా, చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. యుద్ధ […]

Published By: HashtagU Telugu Desk
Mahandu 2026

Mahandu 2026

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“జై తెలుగుదేశం” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగగా, చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. “మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు స్ఫూర్తి మారలేదు” అని పేర్కొన్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. “కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ భావజాలంతో టీడీపీ పుట్టింది. విజన్ పాలిటిక్స్‌కు రూపం తెలుగుదేశం పార్టీ” అని వ్యాఖ్యానించారు. “జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నం” అని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని గుర్తుచేసిన చంద్రబాబు.. దాడులు, హింస, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ వెనకడుగు వేయలేదన్నారు. “నరహంతకులు పీకలు కోసినా టీడీపీ కార్యకర్తలు జెండాను విడిచిపెట్టలేదు. చంద్రయ్యలాంటి కార్యకర్తలు ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అంటూ అమరులయ్యారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తనను అక్రమంగా జైలుకు పంపారని, లోకేష్ యువగళ యాత్రను అడ్డుకున్నారని, పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. “బాధితుల్నే నిందితులుగా మార్చినా ప్రజాస్వామ్యం కోసం టీడీపీ పోరాటం ఆపలేదు” అని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మహిళా సాధికారత కోసం టీడీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్న చంద్రబాబు.. “ఆస్తి హక్కు నుంచి ‘తల్లికి వందనం’ వరకు మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవం కోసం పనిచేస్తున్నాం” అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  Last Updated: 27 May 2026, 11:55 AM IST