CM Chandrababu New House In Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇటీవల అమరావతిలో తన ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలాన్ని అన్వేషించిన చంద్రబాబు, చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్గా పేర్కొంటున్నారు. కాగా, ఆ రైతులకు ఇప్పటికే డబ్బు చెల్లించినట్లు సమాచారం. ఈ ప్లాట్ 25 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది, మరియు ఇది ఈ-6 రోడ్డుకు సమీపంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో, ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు కూడా ఉన్నాయని వెల్లడిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అమరావతిలో కొనుగోలు చేసిన స్థలం, రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గానికి సమీపంలో ఉందని తెలుస్తోంది. ఈ స్థలం చుట్టూ, రాజధానిలో ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి, వాటిలో తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు అన్ని ఈ ప్లాట్కు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లో, రెండు ఎకరాలలో ఇల్లు నిర్మించి, మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితర అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం. చంద్రబాబు ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్టు చెబుతున్న స్థలంలో, ప్రస్తుతం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున ఉన్న ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్హౌస్లో ఉంటున్నారు. గత పదేళ్లుగా ఈ నివాసంలోనే ఆయన నివసిస్తున్నారు. అమరావతి నిర్మాణం ప్రారంభమైన తర్వాత సొంతింటి నిర్మాణం చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతోందనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు కేరాఫ్ ఉండవల్లి, ఇకపై ఆయన కేరాఫ్ వెలగపూడిగా మారబోతోందనే చర్చలు జరుగుతున్నాయి. అయితే, చంద్రబాబు భూమి కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.