ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు. మూడు రోజుల పాటు ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణాన్ని పరిశీలిస్తూ, ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని వివరించడానికి ఈ పర్యటన కీలకంగా మారనుంది.
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
చంద్రబాబు పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, వచ్చే నెల విశాఖపట్నంలో జరగనున్న CII గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ హబ్బులు స్థాపించేందుకు అవకాశాలు అన్వేషించనున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పోర్టులు, రోడ్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.
సీఎం వెంట మంత్రులు టీజీ భరత్, జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం, ఈ పర్యటన ద్వారా అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయనే అంచనా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికపై దృష్టి సారిస్తున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన విదేశీ పర్యటనలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును తీసుకువచ్చిన నేపథ్యంలో, ఈసారి కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందనే నమ్మకం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
