Site icon HashtagU Telugu

Tirupati Stampede : తమాషా చేస్తున్నారా..? అంటూ జిల్లా కలెక్టర్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Cbn Fire

Cbn Fire

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టికెట్ల పంపిణీ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట (Tirupati Stampede) రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది గాయపడటం బాధాకరం. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

T SAT : ముప్పై రోజుల్లో హిందీ నేర్చుకోవడంపై టి-సాట్ ప్రత్యేక లెసన్స్

తొక్కిసలాట ఘటన జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం, అధికారులు మరియు నేతలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవో గౌతమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, టికెట్ల పంపిణీ సక్రమంగా జరగకపోవడం క్షమించలేని తప్పుగా పేర్కొన్నారు. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. 2500 మందిని అనుమతించడానికి ప్రయత్నించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన సీఎం, టికెట్ల పంపిణీ ప్రక్రియలో అవ్యవస్థలను వివరంగా పరిశీలించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ టికెట్ల జారీపై వివరణ కోరుతూ, ప్రణాళికల లోపాలను ఎత్తిచూపారు. తొక్కిసలాట జరిగిన తర్వాత అంబులెన్స్ ఆలస్యంగా రావడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నిర్వహించేందుకు తగిన విధానాలను అమలు చేయాలని సూచించారు. ఈ ఘటన రాష్ట్రానికి గుణపాఠంగా మారాలని, భక్తుల భద్రతను ప్రాథమికంగా భావించి చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. తగిన సమన్వయం లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అభిప్రాయపడిన చంద్రబాబు, అన్ని స్థాయిల్లో సమర్ధవంతమైన పాలన కోసం అధికారులను క్లాస్ తీసుకున్నారు.