కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రమైన తిరుపతి (Tirupathi)లో అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) సందర్భంగా ఏర్పాటు చేసిన దర్శన టికెట్స్ కోసం భక్తులు పోటీపడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట (Tirupati Stampede) చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటన పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
టికెట్ కౌంటర్ల ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వారు వాపోతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని మండిపడుతున్నారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏంజరిగిందంటే..
వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో మూడు ప్రధాన ప్రాంతాల్లో టోకెన్ల కోసం భక్తులు గుమిగూడారు. శ్రీనివాసం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్, సత్యనారాయణపురం టోకెన్ జారీ కేంద్రాల్లో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన సేలం మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు భక్తులు మృతిచెందినట్లు సమాచారం. అలాగే పలువురు అస్వస్థతకు గురవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాజా సమాచారం మేరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also : Younis Khan: ఆఫ్ఘనిస్థాన్ మెంటార్గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్