Site icon HashtagU Telugu

CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Cbn Delhi Tour

Cbn Delhi Tour

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా చర్చలు జరిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్రం కూడా ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం నుండి సమగ్ర ప్యాకేజీ అవసరమని ఆయన పేర్కొన్నారు. పరిపాలన వైఫల్యం, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ప్లాంట్‌ను సెయిల్‌లో(SAIL) విలీనం చేయడం ఒక పరిష్కారం, కానీ అందుకు సెయిల్(SAIL) మరియు కేంద్రం ఒప్పుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సాధుకొండ, ఎర్రకొండ, గడ్చిరోలిలో ఐరన్ ఓర్ ఉందని, సెయిల్(SAIL) మాదిరి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ కేటాయిస్తే ప్రధాన సమస్య పరిష్కారమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ వెళ్తూ వెళ్తూ.. వారసత్వంగా 85 లక్షల టన్నుల చెత్తను మిగిల్చి వెళ్లారని, కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ మంత్రిత్వ శాఖకు వెళ్లి నిధులు అడిగినా, యుటిలిటీ సర్టిఫికెట్లు (యూసీ) అడుగుతున్నారని ఆయన వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక అరాచకాల వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, దాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్రం, ఏపీ ఆర్థికంగా పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన మద్దతు అందిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానితో మాట్లాడిన చంద్రబాబు:

రాష్ట్రాభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని, అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, పీఎంయూవై కింద కేటాయింపులను పెంచాలని ప్రధానిని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ మరో రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని, ఇందుకోసం కేంద్రం రూ.12,500 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. త్వరలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు త్వరలో మంజూరు కానున్నాయని ఆయన తెలిపారు. రాజధాని పనులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు, విశాఖ ఉక్కును తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా అభివర్ణించారు.

మరో రెండు సంవత్సరాల్లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని, హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేను నాలుగు నుంచి ఎనిమిది లేన్లకు పెంచాలని, హైదరాబాద్ నుంచి అమరావతికి మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రతిపాదించినట్లు చెప్పారు. మచిలీపట్నం రేవును తెలంగాణకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. భోగాపురంలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ మరో రెండు సంవత్సరాల్లో ఏర్పడుతుందని వెల్లడించారు.

బీపీసీఎల్ రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కమిటీ నిర్ణయిస్తుందని, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తన రెండ్రోజుల ఢిల్లీ పర్యటనపై మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

వారసత్వంగా చెత్త మిగిల్చారు:

“జగన్ ఆర్థిక అకృత్యాల కారణంగా ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానికి వివరించాను. స్వచ్ఛభారత్ పథకాన్ని కూడా జగన్ నీరుగార్చారు. ఆయన 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా మిగిల్చారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దించి, 2047 వరకు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దే దిశలో లక్ష్యాన్ని ప్రధానికి వివరించాను.

జగన్ ప్రభుత్వం కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయలేదు. ఏ మంత్రిత్వ శాఖకు వెళ్లి నిధులు అడిగినా యూటిలిటీ సర్టిఫికెట్లు (యూసీ) అడుగుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో సహా కేంద్రం తలపెట్టిన ఏ ప్రాజెక్టుకీ జగన్ రెడ్డి ప్రభుత్వం భూమి కేటాయించలేదు. మ్యాచింగ్ గ్రాంట్లను కూడా విడుదల చేయలేదు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎమ్ కింద కూడా అప్పులు చేసే పరిస్థితి లేదు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

పంచాయతీరాజ్‌ను నాశనం చేశారు:

“రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నాటి వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను కూడా ఇవ్వలేదు. ఉపాధి హామీ డబ్బులను నాటి ప్రభుత్వం ఖర్చు చేయలేదు. విశాఖపట్నం రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి కేటాయించలేదు.

మేం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని సంప్రదించి అనువైన భూమిని కేటాయించాం. డిసెంబరులో ప్రధాని చేతుల మీదుగా రైల్వే జోన్ ప్రారంభమవుతుంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.