Supreme Court : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. క్యురేటివ్ పిటిషన్ల విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ ఈరోజు సమావేశం కానున్నందున.. నేడు లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. ఈవివరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ వేదికగా వెల్లడించారు. దీని ప్రకారం.. ఇవాళ (సెప్టెంబరు 26) సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుటకు రావాల్సిన పిటిషన్లు రేపు (సెప్టెంబరు 27) లేదా వచ్చే వారానికి వాయిదా పడనున్నాయి.సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 2 వరకూ మొత్తం 5 రోజుల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఒకవేళ రేపు విచారణ జరగకపోతే ఇక ఇవి వచ్చేవారమే ధర్మాసనం ముందుకు వస్తాయి.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. నిన్న ఈ పిటిషన్పై సీజేఐ మెన్షన్ లిస్ట్ ద్వారా ఈ రోజు(మంగళవారం) రావాలని సూచించారు. అయితే ఇప్పుడది వాయిదా పడింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు విచారణకు రావాలంటూ ఇటీవల ఆమెకు సమన్లు జారీ అయ్యాయి. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ కూడా వాయిదా పడింది. క్యురేటివ్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఈరోజు స్పెషల్ బెంచ్ విచారణ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేశారు.