AP Govt : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. తన సర్కారులో కీలక అధికారుల నియామకంపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలోకి 1992 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా(AP Govt) ఉన్న విజయానంద్ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి (ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా సేవలందించారు. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.
కీలకమైన ఇంటెలీజెన్స్ చీఫ్ పోస్టుకు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వేస్ డీజీపీగా ఉంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన బాల సుబ్రమణ్యాన్ని పిలిపించి ఇంటెలీజెన్స్ చీఫ్ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇంతకుముందు వరకు ఏపీ ఇంటెలీజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ఆంజనేయులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. దీంతో ఎన్నికల టైంలో ఆయనను ఈసీ తప్పించింది. ఇవాళ ఆంజనేయులు.. చంద్రబాబును కలిసేందుకు వచ్చినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి కూడా చేదు అనుభవమే ఎదురైంది. చంద్రబాబును కలిసేందుకు ఫోన్లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు. చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ యత్నించారు. కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పంపారు.