AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎఫెక్ట్, అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

  • Written By:
  • Updated On - February 10, 2024 / 11:05 PM IST

AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నేడు ఎకనామిక్ టైమ్స్ సదస్సులో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు. ఇటీవలే టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.

ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‍లో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. అయితే త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం అమిత్ షా తెలిపారు. కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు.

పొత్తులు, సీట్ల పంపకాలపై నిశితంగా చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రాగానే జనసేన అధినేత పవన్‌తో సీట్ల కేటాయింపులపై బాబు చర్చించినట్టు సమాచారం. నిన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి విందు ఇవ్వడంతో పాటు ఇవాళ పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? జనసేన-టీడీపీ మాత్రమే పోటీ చేస్తుందా.. బీజేపీ కూడా జతకడుతుందా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.