TDP : ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ దక్కక నిరాశలో ఉన్న నేతలకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించారు. ఇటీవల టీడీపీలో చేరిన లీడర్లకు కూడా పార్టీ పదవుల్ని కేటాయించారు. తద్వారా వారి ఫోకస్ ఎన్నికలపైకి మళ్లుతుందని, పార్టీ తమను గుర్తిస్తోందనే భావనలోకి నాయకులు వస్తారని టీడీపీ(TDP) అధినాయకత్వం అనుకుంటోంది. అలా టీడీపీలో తాజాగా పార్టీ పదవులు పొందిన కీలక నేతల వివరాలు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
- మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు టీడీపీలో కీలక అవకాశం కల్పించారు. ఆయనను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల సంఘం, పత్రికా సమావేశాల సమన్వయకర్తగా నియమించారు. వీరభద్రరావుకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణతోపాటు పార్టీ గెలుపుకోసం కృషి చేసే కీలక బాధ్యతలను అప్పగించారు.
- పుట్టపర్తి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పను అనంతపురం, ఎమ్మెల్సీ బీటీ నాయుడిని కర్నూలు, ఏరాసు ప్రతాప్రెడ్డిని నంద్యాల లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ప్రకటించారు.
- అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
- మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. నర్సీపట్నానికి చెందిన బోలెం ముత్యాలపాపను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
- అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్యబాబు నియమితులయ్యారు. ఆయన చోడవరం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అభ్యర్థిత్వానికి మొగ్గు చూపడంతో తాతయ్యబాబుకు టికెట్ రాలేదు. దీంతో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు.
- సత్తెనపల్లికి చెందిన కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.
- బనగానపల్లెకు చెందిన కాటసాని చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆలూరుకుచెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి, కదిరికి చెందిన గాజుల శివరాం ప్రతాప్, పీ గన్నవరం నియోజకవర్గానికి చెందిన బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్, ఎస్కోటకే చెందిన రాయవరపు చంద్రశేఖరరావు తదితరులకు టీడీపీలో కీలక పదవులు దక్కాయి.