Chandrababu : అట్రాసిటీ కేసుల‌పై చంద్ర‌బాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఒంగోలులో 17 మంది టీడీపీ మహిళా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 02:17 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఒంగోలులో 17 మంది టీడీపీ మహిళా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. అట్రాసిటీ కేసులు పెట్టి నినాదాలు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట అని చంద్రబాబు మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించేందుకు హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని నినాదాలు చేయడం నేరమా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, ఒంగోలులో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిర్బంధించిన మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ వివాహిత ఇటీవల రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న సమయంలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్ వద్ద టీడీపీ మహిళా నేతలు నినాదాలు చేశారు.