Site icon HashtagU Telugu

CM Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు ముందు తమిళనాడుకు షాకిచ్చిన చంద్రబాబు? ఏంటంటే?

Cm Chandrababu Davos Tour

Cm Chandrababu Davos Tour

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం దావోస్‌ పర్యటనకు వెళ్ళనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఏపీ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటుంది. ఈ సందర్బంగా, ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడిదారులు, కంపెనీలను దావోస్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించే మార్గాలలో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వృద్ధికి కొత్తగా ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు కూడా ఏర్పాటుచేశారు. ఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్‌ నియామకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పట్టు ప్రదర్శించారు, ఈ స్థానం కోసం తమిళనాడుకు చెందిన వ్యక్తిని ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన సరిన్ పరాపరకత్‌ నేతృత్వంలో, తమిళనాడుకు భారీగా పెట్టుబడులు ప్రవహించాయి. సరిన్ పరాపరకత్ గైడెన్స్‌లో అమలు చేసే సులభమైన సింగిల్ విండో ప్రక్రియల వల్ల, గుజరాత్ తర్వాత దేశంలో పెట్టుబడులకి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. అయితే, సరిన్ పరాపరకత్ దావోస్ పర్యటనకు ముందు, ఏపీకి రావడం తమిళనాడుకు పెద్ద ఎదురుదెబ్బగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడానికి, అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే ఏజెన్సీగా పనిచేసేలా, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డును బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా, ఇప్పటివరకు వివిధ కన్సల్టెన్సీ సంస్థల నుండి 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు. అంతేకాక, ఇన్వెస్ట్ ఇండియా నుంచి మరొక రెండు నియామకాలు కూడా జరిగాయి. దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ ప్రత్యేక టీమ్ నాయకత్వం వహించనుంది.

2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డులో పనిచేసిన దాదాపు 12 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను మళ్ళి తిరిగి తీసుకువచ్చారు. అదే సమయంలో, పక్కన ఉన్న తమిళనాడులో పెట్టుబడిదారుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు వారికి మరింత అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వ్యాపారాల పురోగతి వేగవంతమయ్యింది, దాంతో ఇన్వెస్టర్ల దృష్టి ఆంధ్రప్రదేశ్‌పై పడింది.

ఇటీవల, ఏపీ కేబినెట్ రూ.78 వేల కోట్ల విలువైన ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించిన ఉత్తర్వులను జనవరి 6వ తేదీన ప్రభుత్వం జారీ చేసింది. ప్రాజెక్టుల ప్రతిపాదన తేదీ నుంచి ఉత్తర్వులు జారీ చేసే వరకు కేవలం 2 నెలల వ్యవధిలోనే అన్ని అనుమతులు ఇవ్వడం గమనార్హం.

అయితే, తమిళనాడులో పెట్టుబడులకు అవసరమైన భూమి చాలా ఖరీదైనదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అందువల్ల, నీరు, భూమి సమృద్ధిగా ఉన్న పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం, తమిళనాడు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలపై దృష్టి పెట్టినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ స్టీల్, పెట్రోకెమికల్స్ వంటి రంగాలపై మరింత దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, సరిన్ పరాపరకత్‌ నేతృత్వంలో, దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కి భారీ పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు సర్కారు ఆశిస్తున్నది.