టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు `వస్తున్నా మీకోసం` పాదయాత్ర చేసి ఇవాళ్లికి 10 ఏళ్లు. పాదయాత్రను పూర్తి చేసిన రోజు ఇదే. ఈ సందర్భం గా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేతను హైదరాబాద్ లోని అయన నివాసం లో కలిశారు. పాదయాత్ర విశేషాలను ఆయనతో పంచుకున్నారు. వయసు మీద పడినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన వస్తున్నా..మీకోసం యాత్ర ఒక రికార్డ్ . అందుకే, ఆ యాత్రను టీడీపీ క్యాడర్ మరువలేదు.
యాత్ర ముగిసిన రోజును గుర్తు చేసుకుంటూ కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు కేక్ కట్ చేశారు. 2012 అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభమైన `వస్తున్నా మీకోసం` పాదయాత్ర 208 రోజుల పాటు సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆ యాత్రను గుర్తు చేసుకుంటూ పార్టీ నేతలు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, గోనుగుంట్ల కోటేశ్వర రావు, చంద్రదండు ప్రకాష్ నాయుడు, ప్రకాష్ రెడ్డి, మీడియా కార్యదర్వి , సత్యనారాయణ తదితర నేతలు చంద్రబాబును కలిశారు. ఆ యాత్రను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మీడియా పరంగా కో ఆర్డినేట్ చేసిన టీడీపీ మీడియా కార్యదర్శి ప్రకాశ్ రెడ్డిని, ఇతర టీం మెంబెర్స్ ని నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.