Chandrababu Case: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత ఫైల్లో ఆయన పేరు, సంతకం లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన తండ్రి చంద్రబాబు పాలసీ మేకర్ మాత్రమేనని , మిగతా బాధ్యత అంతా ప్రేమచంద్రారెడ్డిదేనని లోకేష్ మీడియా ప్రతినిధులతో అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ప్రేమచంద్రారెడ్డి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని తెలిపారు. 2021లో నమోదైన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు లేదని లోకేష్ ఎత్తిచూపారు. జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందనే భయంతోనే చంద్రబాబుపై కేసు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని లోకేష్ ,బాలకృష్ణ, పవన్ కల్యాణ్తో కలిసి పరామర్శించారు. తన తల్లి నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీడీపీ, జేఎస్పీ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని లోకేష్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో భూ, మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించిన లోకేష్, ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తొలి నిర్ణయమే విధ్వంసకరమని, గతంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుని ఎలాగైనా రిమాండ్కి పంపాలనేది ఈ సైకో జగన్ కోరిక అని లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు బనాయిస్తున్నారని, ఇతర పార్టీల నేతలపై కూడా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం నాపై హత్యాయత్నం కేసుతో సహా కనీసం 20 కేసులు నమోదు చేసిందని లోకేశ్ అన్నారు.
Also Read: Chandrababu Arrest : రోజా సంబరాలపై పవన్ కామెంట్స్ ..