ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను తలచుకుని ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అసెంబ్లీలో తన వ్యక్తిగత విషయాలు ప్రతిపక్షం ప్రస్తావంచడంపై విచారం వ్యక్తం చేశారు. తన భార్య భువనేశ్వరి ఎలాంటి పరిస్ధితుల్లో అయినా తనకు అండగా ఉంటుందని, ఎప్పుడూ తాను అసెంబ్లీలో ఎవరి వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదని అన్నారు.అలాంటిది భువనేశ్వరి గురించి మాట్లాడటం దారుణమని చెబుతూ కంటతడి పెట్టారు చంద్రబాబు.
Also Read : అసెంబ్లీని బహిష్కరించిన చంద్రబాబు.. మళ్లీ సీఎంగా వస్తానని శపథం
తమ తప్పులను వేరేవాళ్లపై రుద్ది వైసీపీ మభ్యపడుతోందని చంద్రబాబు ఆరోపించారు. తమపై ఇంకా దాడులు చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది, ధర్మాన్ని కాపాడిన తర్వాతే తాను ముందుకెళతానని అన్నారు. ప్రజాక్షేత్రంలోనే వైసీపీ అరాచకాలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. తనకు సీఎం అవ్వాలని లేదని, ఇంత దారుణంగా రాజకీయాలు దిగజారుతాయని అనుకోలేదన్నారు. తన జీవితంలో ఇవాళ జరిగిన సంఘటన మర్చిపోలేనని అన్నారు.
రాజకీయాల్లో విలువలు ఉండాలని 40 ఏళ్లుగా ఎన్ని మాట్లాడినా తాను భరించానన్నారు చంద్రబాబు. క్రమశిక్షణే కార్యకర్తలకూ అలవాటు చేశానని, అవతలివాళ్లు బూతులు తిట్టినా విలువల కోసమే సైలెంట్గా ఉన్నానన్నారు. ధర్మపోరాటంలో తనకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి క్షేత్రస్ధాయిలో తేల్చుకున్నాకనే వెళ్తానని అన్నారు.