సీఎం జగన్ తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నాడని..ముమ్మాటికీ జగన్ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను కేసుల నుండి బయటపడేందుకు చనిపోయిన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మరో రెండు నెలల్లో సైకోని ఇంటికి పంపాల్సిందేనని.. తెలుగింటి ఆడపడుచులు తన వెంట ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించి జయిస్తానన్నారు. రాష్ట్రంలోని యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారని..వారు తలుచుకుంటే విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలవాల్సిన అవసరం ఉందని.. ఈ గెలుపు తన కోసం కాదన్నారు. ఒక కుటుంబ పెద్ద త్రాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుందని.. రాష్ట్ర పెద్ద సైకో అయితే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. ఇప్పుడు అదే మన రాష్ట్రంలో జరగిందని.. జగన్ రెడ్డి మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడని ఆరోపిచారు. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు..ప్రజలే జగన్ రెడ్డిని బరించే స్థితిలో లేరని.. ప్రజలే జగన్ రెడ్డిని ఇంటికి పంపుతారని చంద్రబాబు అన్నారు.
ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా నష్టపోయారని.. ఇచ్చేది పదయితే దోచుకునేది తొంభై అని చంద్రబాబు ఆరోపించారు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని.. విద్యుత్ వినియోగదారులపై రూ.64 వేల కోట్ల భారాలు మోపారని ఆరోపించారు ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని మద్యంపై దోచుకుంటున్నాడని.. ఒక క్వార్టర్ మందులో రూ.150 లు జగన్ రెడ్డి కమీషన్ కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విధంగా జగన్ అనే జలగ ఏడాదికి రూ.54 వేల రూపాయలు మద్యం తాగేవారి నుంచి దోచేస్తున్నాడని.. ఈ దోపిడీకి జగన్ రెడ్డిని ఏం చేయాలి అని ప్రశ్నించారు. జే బ్రాండ్ల మందు తాగిన 30 లక్షల మంది అనారోగ్యం పాలు కాగా, 30 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, ఈ జగన్ అనే జలగ మాత్రం ప్రజల రక్తాన్ని త్రాగుతూనే ఉన్నాడన్నారు.. ఇంటిపై పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలను పెంచాడు. జగన్ రెడ్డి పంచభూతాలను మింగేసే అక్రమార్జునుడు. నా జీవితంలో ఇంతటి అక్రమార్జునుడి చూడలేదన్నారు.