టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆ పార్టీ నేతలతో పాటు చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని యాగాలు, హోమాలు, పూజలు నిర్వహిస్తుండగా మరికొంతమంది చంద్రబాబు అభిమానులు దేవాలయాలకు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గగానికి చెందిన చంద్రబాబు అభిమాని కుప్పం నుంచి రాజమండ్రికి సైకిల్ యాత్ర చేపట్టారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపేందుకు సైకిల్పై రాజమండ్రి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కణంపచర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈనెల 12న కుప్పంలో సైకిల్పై బయలుదేరి మంగళవారం సాయంత్రం రాజమండ్రి చేరుకున్నాడు.
బెంగుళూరులోని సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న గణపతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిరకాలంగా అభిమాని. సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలుసుకున్న గణపతి చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు 724 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి రాజమండ్రి వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రిలో ఉంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను ఆయన కలిశారు. ఆయన అభిమానాన్ని చూసి ఉద్వేగానికి లోనైన భువనేశ్వరి.. పార్టీ శ్రేణుల మద్దతుతోనే తాము బలంగా ఉన్నామని, తమపై ఇంతటి అభిమానం ఉందన్నారు. తన అభిమానులందరి మద్దతుతో చంద్రబాబు నిర్దోషిగా బయటపడతారని యువకుడికి ఆమె చెప్పారు. కుప్పం ప్రజలు తమపై చూపుతున్న అభిమానాన్ని చంద్రబాబు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని నారా బ్రాహ్మణి అన్నారు.