Site icon HashtagU Telugu

Babu Fire In Kuppam:కుప్పం కోవర్ట్ లపై బాబు ఫైర్

పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా అన్ని ప్రక్షాళన చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలోని దేవరాజపురంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఇన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎప్పుడూ చూడలేదని, అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజలను జగన్‌రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఓటీఎస్‌ ఎవరూ కట్టొద్దు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టనని చంద్రబాబు హెచ్చరించారు.