YS Sharmila: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: వైఎస్ షర్మిల

  • Written By:
  • Updated On - January 21, 2024 / 04:38 PM IST

YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలిరోజే టీడీపీ, వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పు చేస్తే.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్‌ రూ.3లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. అన్ని బకాయిలు కలిపితే రాష్ట్రంపై రూ.10లక్షల కోట్ల భారం ఉందని అన్నారు. ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

విజయవాడలో కనీసం ఒక మెట్రో కూడా వేయించలేకపోయారని షర్మిల విమర్శలు చేశారు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని దుస్థితి తీసుకొచ్చారంటూ పాలకులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా దోచుకోవడం.. దాచుకోవడం జరుగుతున్నాయని అన్నారు. ఇటు చంద్రబాబు, అటు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనీ.. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు ఏనాడూ ఉద్యమం చేయలేదని అన్నారు. పైగా ఉద్యమం చేసేవారిని జైలులో పెట్టారని ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహారదీక్షలు చేశారు.. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తలేదని అన్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ, వైసీపీని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది.