AP Railway Zone : ఏపీ రైల్వే జోన్ కిరికిరి

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 11:39 AM IST

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది. ఏపీలోనివిశాఖకు కొత్తగా రైల్వే జోన్ ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తెగేసి చెప్పింది. రాష్ట్ర విభజన చట్టం-2014లోని అంశాలపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో నూ కేంద్రం తాజాగా చర్చలు ప్రారంభించింది. దీనిలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ క్రమంలో రైల్వే బోర్డు చైర్మన్ ఏపీలోని విశాఖలో రైల్వే బోర్డ్ ఏర్పాటు చేసే యోచన లేదన్నారు. దీనిపై హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్గానికి వదిలేయండి. దీనిపై తర్వాత చర్చిద్దాం“ అని బోర్డు చైర్మన్కు భల్లా చెప్పారు. మొత్తం 14 అంశాలతో కూడిన అజెండాపై తాజాగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏపీలో కొత్త రాజధానికి నిధులు ఏడు వెనుక బడిన జిల్లాలకు నిధులు విద్యాసంస్థల ఏర్పాటు సహా రైల్ ర్యాపిడ్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ తరఫున సమావేశానికి హాజరైన సీఎస్ సమీర్ శర్మ కొత్త రాజధాని నిర్మాణానికి రూ.1000 కోట్లు కావాలని విన్నవించారు. అమరావతి అభివృద్ధికి ఆ నిధులు వెచ్చిస్తామన్నారు. అయితే, కేంద్ర అధికారులు మాత్రం గతంలో ఇచ్చిన 1500 కోట్ల లెక్కలు చెప్పాలని వాటి వివరాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. ఇదిలావుంటే రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఏపీ రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని సూచించిన విషయాన్ని ఏపీ అధికారులు లేవనెత్తారు.

విభజన హామీల్లో కీలకమైన రైల్వే జోన్ వ్యవహారంపై మాత్రం రైల్వే బోర్డ్ తిప్పేసినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ డిమాండ్ పెండింగులోనే ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కూడా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై ఒక ప్రకటన చేశారు. రైల్వే జోన్ కోసం స్థలాన్ని వెతుకుతున్నామని ప్రకటించారు. అన్నీ జరుగుతాయని కూడా హామీ ఇచ్చారు.కానీ ఇంతలో బోర్డు మాత్రం ప్లేట్ ఫిరాయించడం గమనార్హం. మంత్రి ప్రకటన తర్వాత విశాఖ రైల్వే జోన్పై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే. ఇప్పుడు బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. విశాఖలోల రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, పేర్కొన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థలను కేంద్ర హోం శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రెండు గంటల సమావేశంలో ఎలాంటి హామీలు దక్కక పోవడం తో ఇరు రాష్ట్రాల అధికారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రైల్వే జోన్ రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటి చెబుతుంటే, జేవీయల్ మరొకటి అంటున్నారు. బీజేపీ, వైసీపీ పొలిటికల్ గేమ్ నడుమ విశాఖ రైల్వే జోన్ ఒక జోక్ గా మారింది.