వచ్చే ఎన్నికల కోసం టీడీపీ (CBN) సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో ఇతర పార్టీల్లోని సీనియర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు వాటిలో తెలుగుదేశం బలపడే ప్రణాళికను రచించింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా మీద చంద్రబాబునాయుడు ఫోకస్ పెట్టారు. అక్కడి శింగనమల నియోజకవర్గంపై ఆపరేషన్ ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy) సీనియర్ పొలిటీషియన్. తొలి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మంత్రి, ఎంపీ పదవులను నిర్వహించారు. గత 40ఏళ్లకు పైగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి కేంద్రంగా తిరుగులేని లీడర్ గా ఎదిగారు. ఆయన ఈసారి జిల్లా వ్యాప్తంగా ప్రాబల్యం చూపాలని అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబునాయుడు(CBN) ఆదేశం మేరకు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం మీద కన్నేశారు.
ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి బండారు శ్రావణి ఓడిపోయారు. ఆమెకు అంతర్గత గ్రూపుల బెడద ఉంది. రాబోవు ఎన్నికల్లో ఆమె కంటే మెరుగైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. అక్కడ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డాక్టర్ సాకేత్ శైలజానాథ్ ను(Sailjanath) బరిలోకి దించడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజుల క్రితం శైలజానాథ్ తో భేటీ అయ్యారు. టిక్కెట్ ఖచ్చితంగా ఇచ్చేలా చంద్రబాబు హామీ ఇస్తే టీడీపీ కండువా కప్పుకోవడానికి ఆయన సిద్దమైనట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి 2044, 2009 ఎన్నికల్లో శైలజానాథ్ గెలుపొందారు. ఆయన స్వర్గీయ వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) క్యాబినెట్లతో పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. అయినప్పటికీ ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల వరకు ఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ పనిచేశారు. ఆయన పనితీరు నచ్చకపోవడంతో శైలజానాథ్ స్థానంలో గిడుగు రుద్రరాజుకు(Gidugu Rudraraju) కాంగ్రెస్ అధిష్టానం పీసీసీని అప్పగించింది. అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా శైలజానాథ్(Sailajanath) కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. పైగా ఆ పార్టీకి ఏపీలో ఏ మాత్రం ఆదరణ లేదు. దీంతో ఇతర పార్టీల వైపు చూడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం జేసీ(Diwakar Reddy), శైలజానాథ్ కలిసి పనిచేశారు. ఇద్దరూ ఒకేసారి మంత్రులుగా కూడా ఉన్నారు. వాళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే, శైలజానాథ్ ను పార్టీలోకి తీసుకురావడానికి జేసీ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి (Raghuveera Reddy)కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇమడలేక విరమించుకున్నట్టు కూడా ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను వీడలేదు. తాజాగా కర్ణాటక ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. ఆ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లోనూ పెనుమార్పులు ఉండే అవకాశం ఉంది.
Also Read : CBN Talks : చంద్రబాబు ఢిల్లీ పొలిటికల్ దర్బార్
తెలుగుదేశం పార్టీకి రఘువీరెడ్డిని (Raghuveera Reddy)తీసుకురావడానికి టీడీపీ ఇటీవల ప్రయత్నం చేసింది. కొందరు కీలక లీడర్లను రఘువీరెడ్డితో భేటీ అయ్యారు. కళ్యాణదుర్గం నుంచి ఆయన్ను పోటీ చేయించాలని ఆపరేషన్ చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన సీనియర్ నాయకునిగా రఘువీరారెడ్డి ఉన్నారు. ఆయనకు మచ్చలేని నాయకునిగా పేరుంది. అనంతపురం జిల్లాలో ఈసారి స్వీప్ చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో రెండు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. అదే 2014 ఎన్నికల్లో రెండు తప్ప మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలిచింది. తొలి నుంచి టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపుకోసం టీడీపీ(CBN) మాస్టర్ స్కెచ్ వేస్తోంది. అందుకోసం శైలజానాథ్, రఘువీరారెడ్డి మీద ఆపరేషన్ చేస్తోంది.అందుకు, జేసీ(Diwakar Reddy) దూతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : YCP-TDP :దళిత కార్డ్ తీసిన జగన్ !CBN టార్గెట్