సంక్రాంతి సందర్భంగా సంబురాల్లో నిమగ్నమైన చంద్రబాబునాయుడు పొత్తుల గురించి పరోక్షంగా సంచలన సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో(CBN-175) టీడీపీ గెలుపు ఖాయమంటూ చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోజరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో జనసేనతో (Janasena)పొత్తు అంశంపై పునరాలోచనలో టీడీపీ పడిందన్న అనుమానం కలుగుతోంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థులు సైతం పసిగట్టారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు 160 స్థానాల్లో గెలవబోతున్నామని తాజాగా వెల్లడించారు. అంటే, 15 సీట్లను పొత్తులో భాగంగా వదిలేసినట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారంనాడు 175 చోట్ల (CBN-175) టీడీపీ గెలవనుందని చెప్పడం క్యాడర్ కు నూతనోత్సాహాన్ని ఇస్తోంది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జరిగిన యువశక్తి వేదికపై జనసేన `వీరమరణం` గురించి పవన్ ప్రస్తావించారు. అందుకే, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ఒక వేళ టీడీపీతో పొత్తు లేకపోతే శాశ్వతంగా జనసేన (Janasena) కు గుర్తింపు ఉండదని ఆయన ఇచ్చిన సంకేతంలోని ఆంతర్యం. అందుకే, గౌరవప్రద స్థానాలతో పొత్తుకు సిద్దమవుతున్నట్టు రణస్థలం వద్ద క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆ విషయాన్ని చెప్పడానికి మాత్రమే యువశక్తి సమావేశాన్ని పెట్టినట్టు వైసీపీ ముందే చెప్పింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తానని చెబుతోన్న పవన్ తాజాగా బీజేపీని వదిలేసినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
Also Read : CBN-Daggupati : తోడళ్లుల్ల మధ్య జగన్ స్కెచ్! దగ్గుబాటి ఆప్తుడికి పర్చూరు
లేటెస్ట్ సర్వేల ప్రకారం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీకి వచ్చే స్థానాల కంటే కనీసం 10 తగ్గుతాయని అంచనా. అంటే, బీజేపీ మీద ఏపీ ప్రజల ఆగ్రహంగా ఉన్న విషయాన్ని సర్వేలు గుర్తు చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఓటర్ల మీద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ప్రభావం ఉంది. అలాగే, ప్రత్యేక హోదా గురించి బీజేపీ చెప్పే మాటలు యువతను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇక తటస్థ ఓటర్లలో బీజేపీ మీద తీవ్రమైన ఆగ్రహం ఉందని సర్వేల సారాంశం. ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, చంద్రబాబు హయాంలో చెప్పిన ప్రత్యేక ప్యాకేజి తదితరాలు ఇవ్వలేదని తటస్థ ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీకి ఒక శాతానికి మించి ఓటు బ్యాంకు ఏపీలో లేదని గత ఎన్నికల ఫలితాలను చూస్తే బోధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు టీడీపీకి డేంజర్ గా తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
ఇక జనసేనతో పొత్తు పెట్టుకుంటే అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు ఇవ్వడానికి సిద్ధపడినట్టు సంకేతం వెళుతోంది. బీసీలుగా కాపులను గుర్తించడానికి వెనుకబడిన వర్గాలు ఏ మాత్రం అంగీకారంగా లేరు. ఇప్పటికే బలిజ, శెట్టి బలిజ, ఒంటరి, తెలగ, రెల్లి తదితర కులాలు బీసీ రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. కాపులకు కూడా బీసీ రిజర్వేషన్లను వర్తింప చేయడానికి ఆ కులాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని సర్వేల సారాంశం. అందుకే, ఒంటరిగా వెళ్లాలని టీడీపీ అంతర్గత సమావేశాల్లో చర్చించినట్టు తెలుస్తోంది. అందుకే, తాజాగా చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారని కొందరు భావిస్తున్నారు.
Also Read : CBN Sankranthi : సంబురాలకు నారావారిపల్లెకు నందమూరి, నారా ఫ్యామిలీ
`వైనాట్ 175` అంటూ వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రజల మధ్యకు బలంగా ఆ స్లోగన్ తీసుకెళ్లారు. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని పెంచేలా `వై నాట్ 175` వైసీపీకి బూస్టప్ ఇస్తోంది. ప్రజల్లోనూ పాజిటివ్ సంకేతాలు వచ్చేలా ఆ సంకేతం ఉందని చంద్రబాబు గ్రహించారని కొందరు చెప్పుకుంటున్నారు. అందుకే, జగన్మోహన్ రెడ్డి `వైనాట్ 175` కు కౌంటర్ గా చంద్రబాబు కూడా 175 స్థానాల్లో గెలుస్తున్నామన్న సంకేతం ఇస్తున్నారని పార్టీలోని కొందరి అభిప్రాయం. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారు అయిందని, ఎలాంటి సందేహం ఆ విషయంలో లేదని టీడీపీలోని కోర్ టీమ్ ప్రైవేటు సంభాషణల్లోని వాయిస్. మరి, చంద్రబాబు తాజా `175 స్లోగన్` వెనుక ఏముందో భవిష్యత్ చెప్పాలి.