Jagan Vs CBI : మే 13న పోలింగ్ ఘట్టం ముగిసిన తర్వాత ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు లండన్, స్విట్జర్లాండ్, జెరూసలేం విహారయాత్రకు వెళ్లాలని భావించిన ఏపీ సీఎం జగన్కు సీబీఐ షాక్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ నెల 6న జగన్ వేసిన పిటిషన్కు.. ఇవాళ సీబీఐ కౌంటర్ పిటిషన్ను దాఖలు చేసింది. లండన్లో కుమార్తెలు ఉండడంతో వారిని కలిసేందుకు జగన్ వెళ్తున్నారని ఏపీ సీఎం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ ఇంకా జరుగుతూనే ఉందని.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు పర్మిషన్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అయితే గతంలో కూడా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని జగన్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. జగన్ దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ(Jagan Vs CBI) కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join
ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లపై ఇవాళ ఎన్నికల ప్రచారం వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీతో ఎందుకు జతకట్టారని ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రశ్నించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎన్డీఏ కూటమిలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని జగన్ అడిగారు. తాము ఏపీలో ముస్లింలకు అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తామని తేల్చి చెప్పారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ బీసీలు ఉన్నట్లే.. ముస్లింలలోనూ బీసీలు ఉన్నారని.. వారికే తాము రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు అందిస్తున్నామని జగన్ వెల్లడించారు. ముస్లింలలోని నిరుపేద వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్దం కాదన్నారు.