టీడీపీ నేతల ఇళ్లపై ఏపీ సీఐడీ దాడుల వేగం మరింత పెరిగింది. శనివారం చింతకాల విజయ్ ఇంటిలో సీఐడీ అధికారులు హల్ చల్ చేశారు. హైదరాబాద్లోని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజార్ హిల్స్ లోని ఇంట్లో విజయ్ లేకపోవడంతో అక్కడి సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 6న విజయ్ తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 41 సీఆర్పీసీ కింద విజయ్కి నోటీసులు ఇచ్చారు.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఓ మార్ఫింగ్ వీడియోతో గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పలువురు టీడీపీ నేతలను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సెప్టెంబర్ 15న విచారణ జరిపిన న్యాయస్థానం గోరంట్ల కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించింది.
ఇదిలాఉంటే, ఈ ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పలేదని ఆరోపించారు. ఇంట్లో పిల్లలు ఉన్న సయమంలో పోలీసుల పేరుతో హల్చల్ చేశారని, వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియదని అంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించాలని బెదిరించినట్లు విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం సాగిస్తామన్నారు విజయ్ కుటుంబం అంటోంది.