సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలోనే విశాఖ రాజధాని(Capital AP) హంగులను సంతరించుకుంటోంది. తాజాగా హైదరాబాద్ నుంచి ఆర్బీఐ(RBI) ఆఫీస్ ను తరలించడానికి రంగం సిద్ధమైయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు 2024 నాటికి ముగియనుంది. ఆ లోపు ఆర్బీఐ కార్యాలయాన్ని ఏపీకి తరలించడానికి సిద్దమయింది. ఏపీ ప్రభుత్వం నుంచి అందుకున్న ప్రతిపాదన మేరకు విశాఖపట్నంకు ఆర్బీఐ కార్యాలయం వెళ్లనుంది.
ముంబాయ్ కేంద్ర కార్యాలయంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)పనిచేస్తోంది. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ప్రాంతీయ కార్యాయాలను కలిగి ఉంది. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆర్బీఐ ఉంది. రాష్ట్రం విడిపోయినప్పటికీ 2024 వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంది. అందుకే, ఇప్పటి వరకు ఆర్బీఐ హైదరాబాద్ కేంద్రంగా ఏపీ తరపున కూడా కార్యకలాపాలను నిర్వహించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపాదన మేరకు విశాఖపట్నంకు తరలివెళ్లనుంది. ఇక మార్చి మూడో వారంలో జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను విశాఖకు(Capital AP) షిఫ్ట్ చేయబోతున్నారు. ఆ మేరకు విశాఖపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ రెండు పర్యాయాలు ముహూర్తం పెట్టగా విశాఖ మారడానికి కుదరలేదు. తొలిసారి హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉండడంతో ఆగిపోయారు. ఆ తరువాత కరోనా కారణంగా 2022 వరకు ఆ ప్రస్తావన లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించారు.
Also Read : Vizag Capital :`సుప్రీం` విచారణ రోజే AP రాజధానిపై జగన్ సంచలన ప్రకటన
ఈసారి మాత్రం మార్చి మూడో వారంలో విశాఖపట్నం తరలివెళ్లనున్నారు. ఆ మేరకు విశాఖపట్నం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అంతేకాదు, హైదరాబాద్ నుంచి తరలివెళ్లనున్న లోకాయుక్త, హెచ్ ఆర్సీ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ ఆఫీస్ ను కర్నూలుకు తరలించిన విషయం విదితమే. హైకోర్టు మినహా దాని అనుబంధంగా ఉండే ఆఫీస్ లను కర్నూలుకు తీసుకెళ్లడానికి శరవేగంగా పనులు జరిగిపోతున్నాయి. ఇక విశాఖ కేంద్రంగా కార్యానిర్వహణ(Capital AP) రాజధానికి అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేశారు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకుంది. ఆ మేరకు కొన్ని పనులు చేస్తోంది.
అమరావతి రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ విచారణ పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు నోటీసులు పంపింది. వాటికి తిరుగు సమాధానం ఇవ్వడానికి కనీసం రెండు వారాల సమయం కావాలని కోరడంతో ఈనెల 23వ తేదీకి కేసును వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే ఢిల్లీ కేంద్రంగా విశాఖ రాజధాని అంశాన్ని పారిశ్రామికవేత్తల సదస్సులో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ రోజు నుంచి విశాఖ రాజధాని పనులు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆర్బీఐ (RBI) కార్యాయాలన్ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించడం హాట్ టాపిక్ అయింది.