రాయలసీమ(Rayalaseema) సమస్యల గురించి పోరాటం చేసే రాయలసీమ పరిరక్షణ సమితి నేత నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) తాజాగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో. రాయలసీమ సమస్యలపై జులై 28న ఛలో ఢిల్లీ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. రాయలసీమ హక్కులు, అభివృద్ధి కోసమే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
నేడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ఎక్కువ నష్టపోయింది రాయలసీమ మాత్రమే. రాయలసీమకు రాయలసీమ నేతలే మొదటి శత్రువులు. పాలకులుగా ఉన్నప్పటికీ రాయలసీమ బాగు కోసం చేసింది ఏమీ లేదు. రెండవ శత్రువు కర్ణాటక.. అప్పర్ భద్ర డ్యాం కట్టి సీమకు నీరు రాకుండా అడ్డుకుంటుంది. మూడో శత్రువు.. సినిమా పరిశ్రమ. కొండారెడ్డి బురుజు దగ్గర హత్యలు, రక్తపాతం చూపించి సీమ అంటే భయపడేలా చేస్తున్నారు. వర్షపు నీటి మీద మాత్రమే ఆధారపడి పంటలు వేయండి అంటూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సిగ్గుచేటు. అప్పర్ భద్ర కడితే పులివెందులకు కూడా నీళ్ళు రావు అని చెబుతున్నా సరే సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. తీగల వంతెన వచ్చిందంటూ కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారు. దాంతో సీమకు ఒరిగేదేమీ లేదు. ఆ స్థానంలో బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టాలని మా డిమాండ్. రాయలసీమను ఇలాగే వడిలిపెడితే దేశ చిత్రపటం నుంచే మాయం అయ్యేలా ఉంది. ఆ స్థాయిలో తిండి లేక, ఉపాధి లేక వలసలు జరుగుతున్నాయి. రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నారు.
ఇక నిరసన కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. రాయలసీమ సమస్యలపై ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం. ఇందుకోసం 4 ట్రైన్స్ కోసం అడిగితే ఒక ట్రైన్ ఇచ్చారు. ఎలాగైనా సరే మొత్తం 10 వేల మంది ఢిల్లీ చేరుకుని మా గళం వినిపిస్తాము. ఆరోజు పార్లమెంట్ వైపు వెళ్లి ముట్టడించే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీ పెద్దలు అనుమతిస్తే మా విన్నపాలు అందజేస్తాం అని తెలిపారు.
Also Read : YS Viveka Murder Case : సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ