వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గుడివాడ లో జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభలో టీడీపీ లో చేరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ యవనేత వంగవీటి రాధాకృష్ణ భవకుమార్ కార్యాలయానికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో భవకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో భవకుమార్ కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. భవ కుమార్ 2014 లో వైసీపీ కార్పొరేటర్ గా పనిచేశారు. 2019 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. తరువాత నామినేటెడ్ పదవులు ఆశించి బంగపడ్డారు. భవ కుమార్ ను బుజ్జగించే క్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవి ఇచ్చి శాంతింపజేశారు. నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావించిన నాటి నుంచి ఒకింత కినుక వహించిన భవ కుమార్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం తగ్గించడంతో నగరంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తామనే టీడీపీ భరోసాతో వైఎస్సార్సీపీ వీడుతున్నట్లు తెలిసింది.
Also Read: Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు