Site icon HashtagU Telugu

Manchu Family -TDP MLA : మంచు ఫ్యామిలీకి బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతు – పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి

Manchufamily Tdp

Manchufamily Tdp

తెలుగుదేశం పార్టీ (TDP) లోని కొంతమంది నేతలు మంచు ఫ్యామిలీ(Manchu Family)కి మద్దతుగా నిలుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో ‘కన్నప్ప’ (Kannappa) మూవీ టీమ్‌తో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudhir Reddy) సందడి చేయడం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. గతంలో కూడా పలువురు టీడీపీ నేతలు మంచు ఫ్యామిలీ విషయంలోనూ ఇదే తరహా మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా పరిస్థితి కొనసాగుతుండటం శ్రేణుల్లో ఆగ్రహం నింపుతుంది. టీడీపీ నేతలు, మంచు కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉండటంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలో మంచు ఫ్యామిలీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి(YCP Govt) బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు, విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలను కేంద్రంగా చేసుకుని టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి టీడీపీ నేతలు మద్దతుగా ఉండడం, వారితో కలిసి ఉండడాన్ని పార్టీ కార్యకర్తలు , అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన నాయకుల్లో ఒకరు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బొజ్జల కుటుంబానికి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తండ్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి కూడా రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన సత్తా చాటారు. బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత, స్థానికంగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తర్వాత ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ హయాంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రోడ్లు, విద్య, వైద్య సేవల అభివృద్ధికి కృషి చేసి ప్రజల మద్దతు సంపాదించారు.

అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గెలుపుతో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీ ప్రభావంతో కొంతకాలం రాజకీయంగా వెనుకబడినట్లు కనిపించినా, సుధీర్ రెడ్డి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి రాజకీయాల్లో సినీ నటుడు, విద్యావేత్త మోహన్ బాబు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మోహన్ బాబు కుటుంబానికి చిత్తూరు జిల్లా, ముఖ్యంగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో మోహన్ బాబు టీడీపీకి వ్యతిరేకంగా గళమెత్తినప్పటికీ, ఇటీవల ఆయన కుటుంబం టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

తాజాగా “కన్నప్ప” సినిమా ప్రాజెక్ట్ ద్వారా మోహన్ బాబు కుటుంబం మరియు టీడీపీ నేతల మధ్య సంబంధాలు మరింత బలపడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఈ పరిణామాల్లో పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన మొదలైన అంశాల్లో ఆయన మోహన్ బాబు కుటుంబంతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మోహన్ బాబు తో బొజ్జల సన్నిహితంగా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది.